
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణం (Ponzi scam) సెగ క్రికెటర్లనూ తాకింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill)తోపాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా బయటకొచ్చింది.
బీజెడ్ గ్రూప్నకు చెందిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరాతీస్తోంది. అందులోభాగంగా గుజరాత్ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుంది. వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ప్రకారం.. ఇందులో గిల్ రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అతడు కాకుండా.. మిగతా క్రికెటర్లు తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా (AUS vs IND) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అది ముగిసి భారత్కు వచ్చాక గిల్కు సమన్లు జారీ చేసి.. విచారణ చేపట్టే అవకాశం ఉంది.
తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లోని పలు ప్రాంతాల ప్రజలను భూపేంద్ర సింగ్ నమ్మించారు. కొద్దికాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈవిషయంపై మూడు నెలల క్రితం కొందరు వ్యక్తులు సీఐడీ (CID) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థకు చెందిన గాంధీనగర్, ఆరావళి, సబర్కాంత, మెహసానా, వడోదరలోని కార్యాలయాలపై దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే దాడులు చేశారు. ప్రజల డబ్బుతో నిందితుడు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.



