
ఈనాడు, హైదరాబాద్: తెలుగునాట పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్పై సామాజిక మాధ్యమాల్లో అతడికి అనుకూలంగా చర్చ సాగుతోంది. కొందరు నిందితుడికి న్యాయసహాయం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏడు రోజులుగా ఐ బొమ్మ బంద్.. నిందితుడి అరెస్ట్ చర్చనీయాంశంగా మారాయి. నగర సైబర్క్రైమ్ పోలీసుల దర్యాప్తులోనూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవంతో మనషులపై నమ్మకాన్ని కోల్పోయాడు. నాలుగేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు పోలీసులు అంచనాకు వచ్చారు.
ఈనెల 14న కూకట్పల్లిలోని నిందితుడి నివాసంలో పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఇల్లంతా చిందరవందరగా ఉండటం.. దుమ్ము ధూళి కొట్టుకుపోవటం గమనించారు. రెండు నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా ఇంటికి చేరేవాడు. తన గుట్టు బయటపడుతుందనే భయం, మనుషులపై నమ్మకం సన్నగిల్లడం కారణంగా పనివాళ్లను ఏర్పాటు చేసుకోలేదని భావిస్తున్నారు. అతడి వద్ద లభించిన సెల్ఫోన్లో కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇంటి స్మార్ట్ డోర్లాక్కు కెమెరా అమర్చాడు. బయటి వ్యక్తులు ఎవరొచ్చినా ముందుగా కెమెరా ద్వారా తెలుసుకున్నాకే తలుపులు తీసేవాడు. పోలీసుల తనిఖీ సమయంలో రహస్య కెమెరాను ముందుగానే పసిగట్టారు.
కోచింగ్ సెంటర్లో ‘ఆమె’ పరిచయం
అమీర్పేట్లోని కోచింగ్ సెంటర్లో యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఏడాదిపాటు సంతోషంగా ఉన్న దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చుపెట్టాయి. అదే సమయంలో భార్య అక్క.. విదేశాల్లోని తమ కుటుంబాలు ఉన్నతంగా ఉన్నాయని ఎగతాళి చేసేది. దానికి భార్య, అత్త వంత పాడటంతో భార్యాభర్తలు విడిపోయారు. కూతుర్ని భార్య తీసుకెళ్లటంతో ఒంటరిగా మిగిలాడు. పైరసీ సినిమాలు, గేమింగ్, బెట్టింగ్ యాప్ల నిర్వాహకులతో వ్యాపార లావాదేవీలు, విదేశాలకు తిరుగుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. కూతుర్ని చూడాలని ఉన్నా అవకాశం లేకుండా పోయిందని చెప్పినట్టు సమాచారం.



