ఇంటర్నెట్డెస్క్: ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’ (Kuberaa). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. మంగళవారం ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న ధనుష్ చిత్ర బృందాన్ని, తన అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు యాక్టింగ్ కంటే దర్శకత్వం పైనే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. అభిమానుల కోసమే సినిమాలు చేస్తున్నానని అన్నారు.
‘‘నాకు నటుడిగా ఉండటం కంటే దర్శకుడిగా ఉండటమే ఎక్కువ ఇష్టం. అభిమానుల కోసమే నేను నటుడిగా ఉండాలనుకుంటున్నా. నా సినిమాల కోసం వారు ఎదురుచూస్తుంటారు. అందుకే సినిమాల్లో నటిస్తున్నా. అలా కానిపక్షంలో యాక్టింగ్కు ఫుల్స్టాప్ పెట్టేసి దర్శకత్వం పైనే పూర్తి దృష్టి పెట్టేవాడిని’’ అని ధనుష్ అన్నారు.
‘కుబేర’ గురించి మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ సమయంలో ‘ది గ్రే మ్యాన్’ షూట్ చేస్తున్నప్పుడు శేఖర్ కమ్ముల నాకు ఈ కథ చెప్పారు. 20 నిమిషాల వీడియో కాల్లోనే ఆయన కథ వివరించారు. నాకు బాగా నచ్చింది. వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత సుమారు రెండేళ్లపాటు స్క్రీన్ప్లే కోసం వర్క్ చేశారు. తిరుపతిలో షూట్కు వెళ్లినప్పుడు ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూశా. ఇందులో నటుడు నాగార్జునతో కలిసి వర్క్ చేశాను. నాకెంతో సంతోషంగా అనిపించింది. ఆయన నటించిన ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాలు చూశా. ‘శివ’లో సైకిల్ చైన్ సీన్ గురించి సెట్లో మేమిద్దరం మాట్లాడుకునేవాళ్లం. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. తెలుగు, తమిళంలో మేము దీనిని షూట్ చేశాం. ఇప్పుడున్న సమాజానికి ముఖ్యమైన చిత్రమిది. సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దాం. సినిమా విషయంలో నేనెంతో నమ్మకంతో ఉన్నా. నన్ను నమ్మి సినిమా చూడండి’’ అని తెలిపారు.
అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జీవితంలో ఎవరినీ ఫాలో కావొద్దన్నారు. మనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ‘‘ఒకరు వేసిన దారిలో నేను నడవలేదు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ శ్రమించి ఇండస్ట్రీలో నాకంటూ ఒక సొంత మార్గాన్ని నిర్మించుకున్నా’’ అని ఆయన చెప్పారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. జూన్ 20న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.