
అమరావతి: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు పథకం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై 20 అజెండా అంశాలపై చర్చించింది.
ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారవాన్ పర్యాటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి భూసేకరణ విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూకేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కుష్ఠు వ్యాధి పదం తొలగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని నిర్ణయించింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు, కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.



