
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (AI)తో ఉద్యోగాలపై ప్రభావం పడుతోందనే వాదనల నడుమ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ట్వీట్ చేశారు. వైట్-కాలర్ ఉద్యోగాలను ‘ఏఐ’ తుడిచిపెడుతుందని మనమంతా భయపడుతున్నామని.. కానీ, అంతకన్నా పెద్ద సంక్షోభాన్ని మర్చిపోతున్నామని తెలిపారు. అదే.. ‘నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత’ అని పేర్కొన్నారు. ఆటోమొబైల్ సంస్థ ‘ఫోర్డ్’ సీఈవో జిమ్ ఫార్లే పాడ్కాస్ట్ను ఉటంకిస్తూ ఆయన ఈమేరకు పోస్టు చేశారు.
‘‘ఫోర్డ్ సీఈవో ఇటీవల తన పాడ్కాస్ట్లో ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తమ సంస్థలో 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిలో చాలా పోస్టులకు రూ.కోటి (1,20,000 డాలర్లు)కిపైగా వార్షిక వేతనం ఉంటుంది. అయినా.. భర్తీ కాలేదు. ఇలా అమెరికావ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్, ఫ్యాక్టరీ రంగాల్లో పది లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి భవిష్యత్తు అంచనాలు కావు. ప్రస్తుతం జరుగుతున్నదే. మనం దశాబ్దాలుగా డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలను ఉన్నతంగా భావిస్తూ వచ్చాం. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అంతగా పట్టించుకోలేదు.
విమానాశ్రయాల్లో వీల్ ఛైర్ల దుర్వినియోగం.. కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు
కానీ, ఈ ఉద్యోగాలను ‘ఏఐ’ (Artificial Intelligence) భర్తీ చేయలేదు. వీటికి జడ్జిమెంట్, నేర్పు, శిక్షణ, అనుభవంతో వచ్చిన నైపుణ్యం వంటివి అవసరం. మన సమాజంలో కలల కెరీర్గా భావించే దానిలో సమూల మార్పులు చూడబోతున్నామా? ఎందుకంటే ఇదే ధోరణి కొనసాగితే.. ప్రపంచాన్ని నిర్మించగల, మరమ్మతు చేయగల, నడిపించగల వ్యక్తులే ఈ ‘ఏఐ’ యుగంలో అతిపెద్ద విజేతలుగా నిలుస్తారు. పోరాటం ద్వారా కార్మికులు పైకి వస్తారని కార్ల్ మార్క్స్ ఊహించారు. కానీ.. నైపుణ్యం, కొరత వంటి కారణాలతో వారు ఎదుగుతారని ఊహించలేదేమో. హింస ద్వారా కాకుండా.. శ్రామిక నైపుణ్యాల ద్వారా ఏర్పడిన విప్లవం ఇది’’ అని ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్వీట్ చేశారు.



