ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఆటో డ్రైవర్లకు సేవలో పథకం రేపు ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15000 అందించనున్నారు. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకంతో ఉపాధి, గిరాకీ కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటోడ్రైవర్ సేవలో పథకం తీసుకువస్తున్నారు. ఈ పథకం కింద సుమారుగా రూ.2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున రూ.435 కోట్లు జమ చేయనున్నారు.

మరోవైపు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కింద 2,25,621 మంది ఆటో డ్రైవర్లు, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మందికి.. అలాగే 20,072 మోటార్ క్యాబ్ డ్రైవర్లు , మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మందికి రూ.15000 చొప్పున అందించనున్నారు. స్త్రీ శక్తి పథకం కారణంగా గిరాకీ తగ్గడంతో పాటుగా రిపేర్ ఖర్చులు, నిర్వహణ వ్యయాలతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అమలు చేస్తోంది. ఇక వాహనాల యజమానుల కోసం గ్రీన్ ట్యాక్స్ను కుదించింది. రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏపీ ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించిన సంగతి తెలిసిందే.
జమ్మి చెట్టుకు పూజ.. ఏపీ సీఎం, బీజేపీ చీఫ్ మధ్య ఆసక్తికర సంభాషణ
మరోవైపు ఆటో డ్రైవర్లకు సేవలో పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సేవలో పథకం అర్హుల జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను ధ్రువీకరించుకుని అర్హుల జాబితాలో చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈ పథకం అమల్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆటో డ్రైవర్లకు సేవలో పథకం లబ్ధి పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కల్గి ఉండాలి.




